ముంబై, ఫిబ్రవరి 20: కార్పొరేట్ రంగం నుంచి వచ్చే కొత్త పెట్టుబడి వ్యయం.. దేశ జీడీపీ వృద్ధిరేటును మరింత బలోపేతం చేసే వీలుందని తాజా బులెటిన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. ప్రైవేట్ పెట్టుబడులే వృద్ధిరేటుకు ఇంధనంగా అభివర్ణించింది. తక్కువ స్థాయిలో 4 శాతంతో స్థిరంగా ఉండే ద్రవ్యోల్బణం.. నిలకడైన జీడీపీ విస్తరణకు పునాదిగా మారగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను చివరి, ఆరో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఈ నెలారంభంలో ఆర్బీఐ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఫిబ్రవరి బులెటిన్ విడుదలైంది. ఇందులో ‘దేశ ఆర్థిక వ్యవస్థ’ పేరుతో వచ్చిన ఆర్టికల్లో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊహించినదానికంటే బలంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇటీవలి నెలల్లో ఈ సంకేతాలున్నాయన్నది.
ఇక దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడైన తీరు.. ఈ 2023-24 ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లోనూ కొనసాగినట్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ‘తదుపరి జీడీపీ వృద్ధికి కార్పొరేట్లు చేసే తాజా మూలధన వ్యయం ఇంధనం కాగలదు’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన మైఖేల్ దేబబ్రత పాత్ర అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకానైతే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల ఆలోచనలు అనుకూలంగానే ఉన్నట్టు చెప్తున్నారు.
రూ.2.4 లక్షల కోట్లు
గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ప్రధాన బ్యాంకులు/అఖిల భారత ఆర్థిక సంస్థలు జారీ చేసిన రుణాలకు సంబంధించిన ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నది. 2022 ఏప్రిల్-డిసెంబర్తో పోల్చితే ఇది 23 శాతం ఎక్కువ. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండో, మూడో త్రైమాసికంలో పెట్టుబడుల కోసం ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీలు), ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) చురుగ్గా సాగినట్టు ఆర్బీఐ బులెటిన్ పేర్కొన్నది.
అయితే తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సమీకరించిన నిధులతో పోల్చితే తక్కువేనని స్పష్టం చేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను దేశ జీడీపీని ఆర్బీఐ 7 శాతంగా అంచనా వేసింది. అలాగే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చన్నది.
అయినప్పటికీ ఆహారోత్పత్తుల ధరల్లో తరచూ చోటుచేసుకుంటున్న పెరుగుదలతో ఇబ్బందేనని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు, వస్తూత్పత్తి ధరల్లో ఒడుదొడుకులూ సమస్యల్ని పెద్దవి చేస్తున్నట్టు పేర్కొన్నది. ఈ నెల ద్రవ్యసమీక్షలోనూ ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచినది తెలిసిందే. రెపోరేటును 6.5 శాతం వద్దే ఉంచగా, రుణ భారం తగ్గేందుకు ఇక ముందు ద్రవ్యసమీక్షల్లోనైనా వడ్డీరేట్ల కోతకు దిగాలని కార్పొరేట్లు కోరుతున్నారు.
ఐఎంఎఫ్ అంచనాతో విభేదం
దేశ డెట్-జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల్ని ఆర్బీఐ తోసిపుచ్చింది. 2030-31 నాటికి జనరల్ గవర్నమెంట్ డెట్-జీడీపీ రేషియో 73.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర అన్నారు. ఐఎంఎఫ్ దీన్ని 78.2 శాతంగా అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ నెల 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ స్థూల ద్రవ్య లోటును దేశ జీడీపీలో 5.1 శాతంగా అంచనా వేశారు. 2025-26లో దీన్ని జీడీపీలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.