Randeep Hooda | బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘ఛావా’ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో ఛత్రపతి శంబాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఏసుబాయిగా రష్మిక తమ నటనతో మెప్పించగా, క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ పవర్ ఫుల్ పాత్రకు అక్షయ్ ఖన్నా మొదటి ఎంపిక కాదనే ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ ఔరంగజేబు పాత్ర కోసం మొదట యాక్టర్ రణ్దీప్ హుడాను సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ను తిరస్కరించడంపై రణ్దీప్ హుడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తాను ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమా కోసం విపరీతంగా బరువు తగ్గి, గుండుతో చాలా సన్నగా ఉన్నానని, ఆ శారీరక స్థితి ఔరంగజేబు పాత్రకు సరిపోదనిపించిందని చెప్పారు. అంతేకాకుండా ఆ సినిమాకు సంబంధించి కోర్టులో ఒక ఐపీ కేసు నడుస్తోందని, కథ పరంగా ఇప్పటికే తన చుట్టూ చాలా హిందూ-ముస్లిం వివాదాస్పద అంశాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఛావా’ కథలో కూడా అలాంటి సున్నితమైన అంశాలు ఎక్కువగా ఉండటంతో, మళ్లీ అలాంటి వివాదాల్లో ఇరుక్కుని ఇబ్బంది పడటం ఇష్టం లేకే ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించినట్లు రణ్దీప్ హుడా స్పష్టం చేశారు.