NDTV takeover | ఎన్డీటీవీగా పేరొందిన న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ( NDTV ) ఇక పూర్తిగా గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సొంతం కాబోతున్నది. ఎన్డీటీవీ ఫౌండర్లు ప్రణయ్ రాయ్, రాధికారాయ్.. సంస్థలోని తమ షేర్లలో అత్యధిక శాతం అదానీ గ్రూప్ అనుబంధ సంస్థకు విక్రయిస్తామని ఎక్స్చేంజ్లకు సమాచారం ఇచ్చినట్లు ప్రకటించారు. ఏఎంజీ మీడియా నెట్వర్క్ అధినేత గౌతం అదానీ సారధ్యంలో ఎన్డీటీవీకి గల విశ్వసనీయత, స్వతంత్ర విలువలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు.
అదానీ గ్రూప్కు 32.26 శాతం వాటా విక్రయిస్తామని ప్రణయ్రాయ్ దంపతులు తెలిపారు. సంస్థలో వారికి 37.44 శాతం వాటా ఉంది. అదానీ గ్రూపుకు వారి వాటా విక్రయంతో ఎన్డీటీవీలో ప్రణయ్రాయ్ దంపతులకు ఐదు శాతం వాటా మాత్రమే ఉంటుంది.
ఎన్డీటీవీలో ఓపెన్ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి గౌతం అదానీతో జరిపిన సంప్రదింపులు నిర్మాణాత్మకంగా ఉన్నాయని ప్రణయ్ రాయ్ దంపతులు తెలిపారు. తాము చేసిన సూచనల పట్ల గౌతం అదానీ సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటికే ఎన్డీటీవీలో అదానీ గ్రూప్కు 69.71 శాతం వాటా లభిస్తుంది.
ఎన్డీటీవీ ఫౌండర్లు తమ వాటాలను విక్రయించడంతో మరి కొంత వాటాను అదానీ గ్రూప్ ఓపెన్ మార్కెట్లో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదానీ టేకోవర్ చేస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఎన్డీటీవీ షేర్లు 16 శాతానికి పైగా పెరిగాయి. ఆర్ఆర్పీఆర్లో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ టేకోవర్ చేయడంతో ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా గత ఆగస్టు 23న అదానీ పరం అయ్యాయి. ఓపెన్ ఆఫర్ ప్రారంభమైన తర్వాత గత నెల 29న ఆర్ఆర్పీఆర్ డైరెక్టర్లుగా ప్రణయ్ రాయ్, రాధికారాయ్ రాజీనామా చేశారు.