న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రసిద్ధ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్లు ఆ టెలివిజన్ ఛానల్ ప్రమోటింగ్ గ్రూప్ సంస్థ నుంచి వైదొలిగారు. ఎన్డీటీవీని టేకోవర్ చేసేక్రమంలో దాని ప్రమోటింగ్ సంస్థల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఛానల్లో ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్కు 29.18 శాతం వాటా ఉంది. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్ల పదవులకు ప్రణయ్, రాధికా రాయ్లు రాజీనామా చేశారు.
32 శాతం వాటా రాయ్లదే
ప్రమోటింగ్ సంస్థ నుంచి వైదొలిగినప్పటికీ, రాయ్లకు ఇప్పటికీ ఎన్డీటీవీ ప్రమోటర్లుగా 32.26 శాతం మెజారిటీ వాటా ఉంది. ఈ న్యూస్ ఛానల్ బోర్డుకు వారు రాజీనామా చేయలేదు. ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ చైర్మన్గా, రాధికా రాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
ఓపెన్ ఆఫర్ కీలకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ ఎన్డీటీవీలో 50 శాతానికి పైగా మెజారిటీ వాటాను చేజిక్కించుకోవాలంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఓపెన్ ఆఫర్ పూర్తిగా విజయవంతం కావాల్సి ఉంటుంది. 2009లో రాయ్లకు చెందిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్) నుంచి తీసుకున్న రూ.400 కోట్ల వడ్డీ రహిత రుణంతో ఇప్పుడా సంస్థ బలవంతంగా చేతులు మారింది. వీసీపీఎల్ను తదుపరి కాలంలో అదానీ కొనుగోలు చేశారు.
అప్పట్లో తీసుకున్న రుణానికి కన్వర్ట్బుల్ వారెంట్లను ఆర్ఆర్పీఎల్ జారిచేసింది. ఈ వారెంట్లను అదానీ గ్రూప్ షేర్లుగా మార్చుకోవడంతో ఆర్ఆర్పీఎల్లో 99.5 శాతం వాటా వీసీపీఎల్కు సంక్రమించింది. దీంతో టెలివిజన్ ఛానల్లో ఆర్ఆర్పీఎల్కు ఉన్న 29.2 శాతం వాటా అదానీ గ్రూప్ స్వంతమయ్యింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్డీటీవీ షేర్హోల్డర్ల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ జారీచేసింది. నవంబర్ 22న ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ 5 వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటివరకూ ఓపెన్ ఆఫర్ పరిణామంలో మూడో వంతు షేర్లు (53.27 లక్షలు) బిడ్ అయ్యాయి. ఆఫర్ పూర్తిగా విజయవంతమైతే ఎన్డీటీవీలో అదానీ వాటా 55 శాతానికి చేరుతుంది. దీంతో ఛానల్ డైరెక్టర్ల బోర్డు ఆధిపత్యం నుంచి రాయ్లను అదానీ గ్రూప్ తప్పించగలుగుతుంది.
ఎన్డీటీవీకి కేటీఆర్ అన్ఫాలో
నిష్పక్షపాతంగా వార్తల్ని, కథనాల్ని ప్రసారం చేస్తుందని పేరొందిన ఎన్డీటీవీ చేతులు మారుతున్న నేపథ్యంలో ఈ ఛానల్ను అన్ఫాలో చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాయ్లు డైరెక్టర్లుగా వైదొలుగుతున్న వార్తను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ఇప్పటివరకూ వారు చేసిన మంచి పనికి ధన్యవాదాలు తెలిపారు.