కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుడి జీవనం అతలాకుతలం అయింది. బతుకు దుర్బరంగా మారిపోయింది. ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన కుటుంబాలనేకం రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి కుటుంబాలను ఆదుకునేది జీవిత బీమా మాత్రమే. అధిక ప్రీమియంలు చెల్లించక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒక వరం. ఎల్ఐసీతో పాటు ఈ బీమా స్కీమ్లో మరికొన్ని బీమా కంపెనీలు కూడా భాగస్వాములే. ప్రతి యేటా కేవలం రూ. 330 ప్రీమియం చెల్లిస్తే చాలు రూ. 2 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ పేరున ఉంటుంది. ప్రీమియంను ప్రతి యేటా చెల్లించాల్సి ఉంటుంది. ఈ టర్మ్ పాలసీని 2015లోనే జారీ చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో దీనికి ప్రాధాన్యత పెరిగింది. స్కీమ్ అర్హత 18 నుంచి 50 ఏండ్ల వయసు, బ్యాంక్ అకౌంట్ మాత్రమే. దాదాపు అన్ని బ్యాంకులు ఈ స్కీమ్లు అమలు చేస్తున్నాయి.
దీనికి కావాల్సిందిల్లా వార్షిక ప్రీమియంను బ్యాంకు ప్రతి యేటా మినహాయించుకునేందుకు ఆటో డెబిట్ కు అనుమతి తెలిపితే చాలు మీకు ఈ పాలసీ వచ్చేసినట్టే. ప్రతి యేటా పాలసీ ఆటో మేటిక్ రెన్యూవల్ అవుతుంది. ఈపాలసీ తీసుకోవాలనుకుంటే, మీ ఖాతా ఉన్న బ్యాంకులోనే దరఖాస్తును నింపి ఇస్తే చాలు. ఎస్ఎంఎస్ ద్వారా ధృవీకరణ కూడా లభిస్తుంది. బీమా క్లెయిమ్ చేయడం కూడా చాలా సులువే. ఖాతాదారుడు మరణించిన తర్వాత బీమా మొత్తాన్ని పొందాలంటే నామీని క్లెయిమ్ దరఖాస్తుతో పాటు డిస్ఛార్జి రిసిప్ట్, డెత్ సర్టిఫికెట్, ఒక క్యాన్సిల్డ్ చెక్, ఖాతాదారుని బ్యాంకు ఖాతా వివరాలను ఫోటోకాపీలతో జత చేసి సమర్పిస్తే చాలు. బ్యాంకు దరఖాస్తును పరిశీలించిన తర్వాత 30 రోజుల్లోగా బీమా కంపెనీకి ఆమోదం కోసం పంపిస్తారు. అలాగే బ్యాంకు నుంచి క్లెయిమ్ అందిన 30 రోజుల్లోగా బీమా మొత్తాన్ని చెల్లించడానికి బీమా కంపెనీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.