EMI Burden | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వరుసగా రెండోసారి రెపొరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. గత నెల నాలుగో తేదీన 40 బేసిక్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. 36 రోజుల్లో రెపొరేట్ రెండు సార్లు పెంచేసింది. దీని ప్రకారం ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్లపై ఇండ్ల రుణాలు తీసుకున్నవారిపై నెలవారీ వాయిదా (ఈఎంఐ) భారం పెరుగనున్నది.
తాజా పెంపుతో రెపోరేట్ 0.9 శాతం పెరిగినట్లయింది. దీంతో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ వడ్డీరేట్లను పెంచేశాయి. తదనుగుణంగా నెలవారీ వాయిదా (ఈఎంఐ) పెరిగిపోనున్నది. మీరు ఏడు శాతం వడ్డీరేటుపై 20 ఏండ్ల టెన్యూర్ గల రూ.30 లక్షల ఇంటి రుణం చెల్లించాలంటే.. ఈఎంఐ రూ.1648 పెరుగుతుంది. అంటే నెలవారీ వాయిదా రూ.23,259 నుంచి రూ.24,907కు చేరుకున్నది. ప్రతి రూ.లక్ష రుణంపై ఈఎంఐపై రూ.55 పెరుగుతుందని అంచనా.
ఏడేండ్ల టెన్యూర్తో 10 శాతం వడ్డీపై 8 లక్షల ఆటోమొబైల్ లోన్ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ వడ్డీ 10.9 శాతానికి పెరిగితే నెలవారీ వాయిదా (ఈఎంఐ) రూ.375 పెరిగిపోతుంది. అంటే రూ.13,281 నుంచి రూ.13,656లకు చేరుతుంది. అలాగే ఐదేండ్ల టెన్యూర్ గల రూ.5 లక్షల రుణం తీసుకున్నారా.. వడ్డీరేటు 14 నుంచి 14.9 శాతానికి చేరుతుంది. అదే జరిగితే ప్రతి ఈఎంఐ రూ.235 పెరిగి రూ.11,634 నుంచి రూ.11,869కి చేరుతుంది. ఆర్బీఐ రెపోరేట్ పెంపు ఇప్పటికే పరిమితం కాదని కొటక్ మహీంద్రా డెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చుర్చిల్భట్ పేర్కొన్నారు.