Cash Circulation | ఐదేండ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆన్లైన్ చెల్లింపులు పెరిగినా.. కరెన్సీ నోట్ల చలామణి కూడా క్రమంగా పెరుగుతున్నది. కరోనా నేపథ్యంలో తలెత్తిన అస్థిరతలతో ప్రజలు ముందుజాగ్రత్తగా కొంత క్యాష్ తమ వద్ద ఉంచుకోవడానికే మొగ్గుతున్నారు. దీంతో గతేడాది నోట్ల చలామణి పెరిగింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యాప్లు, యూపీఐ ద్వరా ఆన్లైన్ చెల్లింపులు పెరిగాయి. ప్రత్యేకించి యూపీఐ సర్వీసులకు ఆదరణ ఎక్కువగా ఉంది.
డిజిటల్ పేమెంట్స్కు ప్రోత్సాహం, నల్లధనం కట్టడి కోసం ఐదేండ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేశారు. డిజిటల్ చెల్లింపుల లక్ష్యం ఫలితాన్నిచ్చాయని గణాంకాలు సూచిస్తున్నా.. ఏడాది కాలంగా నోట్ల చలామణి కూడా పెరుగుతున్నది. 2020-21లో నోట్ల చలామణి 16.8 శాతం పెరిగింది.
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం 2016 నవంబర్ 4న రూ.17.74 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. గత నెల 29 నాటికి అవి రూ.29.17 లక్షలకు పెరిగాయి. ఏడాది కాలంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.2.28 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు 2019-20లో 4.57 లక్షల కోట్లు చలామణి పెరిగింది