Talent Crunch in Auto | మనదేశంలోని వివిధ కంపెనీలు.. ప్రత్యేకించి ఆటోమొబైల్ కంపెనీలు ఇచ్చే జాబ్ ఆఫర్ల పట్ల విదేశీ నిపుణులు ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఆటోమొబైల్ రంగం ఇప్పుడు హైబ్రీడ్, విద్యుత్ కార్ల తయారీ దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. విద్యుత్ కార్లు.. ఈవీల్లో వినియోగించే బ్యాటరీ ( battery ) లు సౌర, సంప్రదాయేతర ఇంధనం ( olar & renewable energy ), పౌర విమానయానం ( aviation ) రంగాల్లో దేశీయంగా నిపుణుల కొరత వెంటాడుతున్నది. దీన్ని అధిగమించేందుకు ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఇస్తున్న జాబ్ ఆఫర్లను విదేశీ నిపుణులు తోసిపుచ్చుతున్నారని వివిధ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు.
భారత్లోని అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా అండ్ మహీంద్రా.. టాటా మోటార్స్కు గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. గ్లోబల్ శాటిలైట్ యూనిట్లు కూడా ఏర్పాటు చేశాయి. వీటిల్లో అవసరమైనప్పుడు విదేశీ నిపుణులు భారత్కు వచ్చి వెళతారు.
భారత్లో కార్యకలాపాలను వేగవంతం చేయడానికి విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఇది చిన్న ప్రయత్నం మాత్రమే. వారికి భారీగా డాలర్ల వేతన ప్యాకేజీ ఆఫర్ చేయాల్సి వస్తుందని అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) చెప్పారు. దేశీయంగా శక్తిమంతమైన ప్రతిభావంతులను నియమించుకోవాల్సి ఉందన్నారు. కొన్నేండ్ల క్రితం దేశంలో సీనియర్ లీడర్షిప్ పాత్ర పోషించేందుకు విదేశీ నిపుణులు భారత్కు వచ్చేవారన్నారు.
కానీ, గతంతో పోలిస్తే భారత్లో జాబ్ ఆఫర్లను ఆమోదించే విదేశీ నిపుణులు 25 శాతం మంది మాత్రమే ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. స్థానికంగా సీఎక్స్వో స్థాయి నిపుణులను నియమించుకోవడానికి రెండు లేదా మూడు నెలలు పడితే.. విదేశీ సీనియర్ నిపుణుల నియామకానికి ఐదారు నెలల టైం పడుతున్నది చెప్పారు. భారత్లో పోలిస్తే థాయిలాండ్ వంటి చిన్న దేశాలు విదేశీ నిపుణులను బాగా ఆకర్షిస్తున్నాయి.
విదేశీ మార్కెట్లలోకి విస్తరించడానికి కొన్ని ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రణాళికలు వేసుకున్నా.. విదేశీ విమానయాన సంస్థలతో పోటీపడలేకపోతున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు.. ఇతర కారణాల వల్లే తమ కుటుంబాలను భారత్కు తీసుకు రావడానికి నిపుణులు ఇష్టపడట్లేదని ఏవియేషన్ కన్సల్టెంట్లు చెబుతున్నారు.