న్యూఢిల్లీ, ఆగస్టు 15: గోల్డ్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో ఎంసీఎక్స్పై బంగారం తులం ధర రూ.53,500 వరకు స్థాయిల్ని తాకవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఆయా దేశాల్లో తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం, డాలర్ సూచీల మధ్య గత వారం పసిడి ధరలు 5 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. క్రిందటి వారం దాదాపు 1.37 శాతం రేట్లు పెరిగాయి. దీంతో వరుసగా నాలుగో వారమూ పరుగులు పెట్టినైట్టెంది. కాగా, స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,760-1,820 డాలర్ల మధ్య కదలాడుతున్నట్టు చెప్తున్న నిపుణులు.. సమీపకాలంలో 1,850 డాలర్లకు వెళ్లే వీలుందన్నారు. పుత్తడి ధరల్ని ప్రభావితం చేసే ఐదు ప్రధానాంశాలున్నట్టు చెప్తున్నారు. వాటిలో..
ముడి చమురు ధర
ముడి చమురు ధరలు ఒడిదుడుకుల్లోనే కొనసాగుతున్నాయి. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇది బంగారం ధరలపైనా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డాలర్ సూచీ
డాలర్ సూచీ దాదాపు 104.63 స్థాయికి పడిపోయింది. అయితే తిరిగి కోలుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ డీఎక్స్ 104.5 స్థాయికి ఎగువన ఉంటే.. గోల్డ్ మార్కెట్లో అమ్మకాలకు అవకాశం ఉంటుంది.
అమెరికా రిటైల్ సేల్స్
ఈ నెల 17న అమెరికా రిటైల్ అమ్మకాల వివరాలు విడుదల కానున్నాయి. అలాగే ఎఫ్వోఎంసీ సమావేశం జరగనున్నది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచాలా?.. లేదా?.. అన్నది ఇందులో చర్చించనున్నారు. పసిడి మదుపరులకు ఈ రెండూ కీలకం. వీటిపై ఆధారపడే పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
రూపీ-డాలర్
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం పెరిగే అవకాశాలే ఎక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బంగారం ధరలు పెరిగే వీలుందంటున్నారు.
ప్రపంచ ఆర్థిక గణాంకాలు
అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ఇండ్ల అమ్మకాలు ఈ వారం విడుదల కానున్నాయి. బ్రిటన్, యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలూ రానున్నాయి. ఇవన్నీ గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేసేవే.