బెంగళూరు, జనవరి 26: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..రిపబ్లిక్ డే ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా కంపెనీ స్కూటర్లను రూ.25 వేల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్1 ఎక్స్ప్లస్ మాడల్పై రూ.20 వేల తగ్గింపు ధర కొనసాగుతున్నదని తెలిపింది. ఈ నెల 31 వరకు ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయని, అలాగే వ్యారెంటీని పెంచుకోవడానికి చెల్లించేదానిపై కూడా 50 శాతం రాయితీ ఇస్తున్న సంస్థ..ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ మాడళ్లపై ఎక్సేంజ్ బోనస్ కింద రూ.2 వేలు ఇస్తున్నది. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.5 వేల వరకు రాయితీ ఆర్థిక ప్రయోజనాలు, జీరో డౌన్పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం సంస్థ రూ.1,19,999, రూ.1,47,499లకు రెండు మాడళ్లను విక్రయిస్తున్నది.
హైదరాబాద్లో ఈ-బైక్ సర్వీసులు
ఓలా మొబిలిటీ రిపబ్లిక్ డే రోజున హైదరాబాద్తో పాటు ఢిల్లీలో ఈ-బైక్ సర్వీసుల్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే బెంగళూరులో ఈ సర్వీసుల్ని నిర్వహిస్తున్న ఓలా తాజాగా వీటిని మరో రెండు నగరాలకు విస్తరించింది. నగరాల్లో ప్రయాణానికి అనువుగా 5 కిలోమీటర్లకు రూ.25, 10 కి.మీకి రూ.50, 15 కి.మీకి రూ.75 కనిష్ఠస్థాయి నుంచి చార్జీలతో ఈ సేవల్ని అందిస్తున్నట్టు కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.