హైదరాబాద్, ఏప్రిల్ 18: రైల్వే కంపెనీలకు కీలకమైన విడిభాగాలు తయారు చేసి అందిస్తున్న పోల్మోర్ స్టీల్.. రాష్ట్రంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్ధమైంది. మెదక్ జిల్లాలోని కాళ్లకల్ వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ను భారత్లో ఉన్న పోలాండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డోమ్జలస్కి గురువారం సందర్శించారు. ఆయనతోపాటు పోలాండ్ కాన్సుల్ జనరల్ అలెక్సాండర్ దండా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ..దేశీయంగా స్టీల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కాళ్లకల్ వద్దవున్న ప్లాంట్కు అనుకొని మరో మూడు ఎకరాల విస్తీర్ణంలో మరో యూనిట్ను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి(రూ.20 కోట్లకు పైగా)తో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్తో మరో 100 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.