హైదరాబాద్, ఏప్రిల్ 22: టెక్నాలజీ స్టార్టప్ ధృవ.. హైదరాబాద్లో శాటిలైట్ ఇన్ఫ్రా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు అవసరమైన నిధులను అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లో స్పేస్క్రాఫ్ట్ సోలార్ అరేస్, శాటిఐల్ సబ్సిస్టమ్స్, వెహికల్ సపరేషన్ సిస్టమ్స్, అసెంబ్లీ ఇంటిగ్రేషన్ ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ సీఈవో సంజయ్ నెక్కంటీ తెలిపారు. సిరీస్ బీ ఫండింగ్లో భాగంగా ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ ఆల్ఫా ఫండ్, బ్లూ అశ్వ క్యాపిటల్ నుంచి 9.3 మిలియన్ డాలర్లు(రూ.78 కోట్లు) సమీకరించింది. సిరీస్ ఏ లో భాగంగా 14 మిలియన్ డాలర్లు లేదా రూ.123 కోట్లు సేకరించిన విషయం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.15 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వచ్చే ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా మరో 30 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.