హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ యూనిట్ను శనివారం (జూలై 31)న ప్రారంభించనున్నారు. భాగ్యనగరంలోని మేకగూడ వద్ద 1,60,000 చ.మీ విస్తీర్ణంలో 90లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీన్ని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఏడాది మార్చి 24న ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కేంద్రం ప్రారంభంతో సంస్థ మొత్తం వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని సీఈవో పరాస్ కుమార్ జైన్ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ. 400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.