PMSMY Pension Benifits | మీరు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. నెలవారీ పెన్షన్ తప్పనిసరి. వృద్దాప్యంలో ఫిక్స్డ్ రిటర్న్స్కు గ్యారంటీనిచ్చే ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడి పథకాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధాన్మంత్రి శ్రమ్యోగి మాంధన్ యోజన (పీఎంఎస్ఎంవై) ఒకటి. మీరు ప్రతి రోజూ రూ.1.80 చెల్లిస్తూ వచ్చారనుకోండి. మీరు నెలవారీగా రూ.3000 పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీం అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేకించి సహాయకులు, టైలర్లు, రిక్షా కార్మికులు, రజకులు, కార్మికులు, చెప్పులు కుట్టే వారికి ఈ స్కీం ఉపకరిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అసంఘటిత రంగంలో సుమారు 42 కోట్ల మంది పని చేస్తున్నారు.
మీ నెలసరి ఆదాయం రూ.15 వేల లోపు ఉండటంతోపాటు.. మీ వయస్సు 40 ఏండ్ల లోపు అయితే ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు నెలవారీగా రూ.3000 వరకూ పెన్షన్ లభిస్తుంది. 2019లో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. వచ్చే ఐదేండ్లలో కనీసం 10 కోట్ల మంది వర్కర్లను ఈ పథకం పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యం.
ప్రభుత్వ మద్దతుతో అమలులో ఉన్న పథకం కనుక రిటర్న్స్ గ్యారంటీ. సంఘటిత రంగంలో పని చేస్తున్న వ్యక్తులు, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో), నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్), స్టేట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), ఆదాయం పన్ను చెల్లింపు దారులు మాత్రం దీనికి అర్హులు కాదు.
విభిన్న వయస్సు గ్రూప్ల వారు విభిన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు 18 ఏండ్ల వయస్సులో ఉంటే రూ.55, మీ వయస్సు 29 ఏండ్లయితే ప్రతి నెలా రూ.100, మీ వయస్సు 40 ఏండ్లలో ఉంటే రూ.200 చెల్లించాలి. ప్రతి ఒక్కరూ 40 ఏండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లబ్ధిదారుడు పెన్షన్ తీసుకోవడానికి ముందే మరణిస్తే.. సదరు వ్యక్తి జీవిత భాగస్వామికి సగం పెన్షన్ చెల్లిస్తారు.
పీఎంఎస్ఎంవై స్కీంలో ఖాతా తెరవాలంటే మీకు మూడు పత్రాలు అవసరం. అవి.. ఆధార్ కార్డ్, ఐఎఫ్ఎస్సీ విత్ సేవింగ్స్ లేదా జన్ధన్ ఖాతా, మొబైల్ నంబర్ జత చేయాలి. కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేయాలి. ఎల్ఐసీ, ఈఎస్ఐ, ఈపీఎఫ్వో, కేంద్ర లేదా రాష్ట్ర కార్మికశాఖ కార్యాలయాలను సందర్శించి కూడా దరఖాస్తు సమర్పించొచ్చు.