హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబర్ 16: అమెరికాకు చెందిన ప్రముఖ ఇండస్ట్రియల్ రిలయబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ పినాకిల్.. హైదరాబాద్లో ఓ కొత్త సెంటర్ను తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే కో-వర్కింగ్ సేవల సంస్థ స్కూటర్ వద్ద 21,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నది. దీని సీటింగ్ సామర్థ్యం 350. ఈ మేరకు ఈ లీజింగ్ డీల్కు మధ్యవర్తిత్వం వహించిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ దిగ్గజం కొల్లీర్స్ ఇండియా సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. గురుగ్రామ్కు చెందిన స్కూటర్.. హైదరాబాద్లో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల్లో ‘మై హోమ్ ట్విట్జా’ పేరుతో ఓ నూతన సెంటర్ను తెస్తున్నది. ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ 3,500 డెస్కులున్నాయి. ఇందులోనే పినాకిల్కు ఆఫీస్ స్పేస్ను స్కూటర్ అందించింది. కాగా, హైదరాబాద్లో స్కూటర్ పోర్ట్ఫోలియో సుమారు 5 లక్షల చదరపు అడుగులుగా ఉన్నది. ఐటీ, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లోని కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్కు తొలి ప్రాధాన్యతనిస్తున్నాయని, దీంతో ఇక్కడ కమర్షియల్, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరిగిందని స్కూటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పునీత్ చంద్ర ఈ సందర్భంగా అంటున్నారు.
హైదరాబాద్లో సరసమైన ధరల్లో ఓ హౌజింగ్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు రియల్టీ సంస్థ అనంత్ రాజ్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. అలాగే దక్షిణ ఢిల్లీలో ఓ బహుళ వినియోగ ప్రాజెక్టునూ కంపెనీ చేపడుతుండగా.. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం డెవలప్మెంట్ ఏరియా 17 లక్షల చదరపు అడుగులుగా ఉన్నది. ఢిల్లీ ప్రాజెక్టు 7 లక్షల చదరపు అడుగుల్లో రానుండగా, హైదరాబాద్ ప్రాజెక్టు 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం కానున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ ప్రాజెక్టుల వ్యయానికి సంబంధించిన వివరాలను సంస్థ తెలియపర్చలేదు.
హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలు జోరుగా సాగాయి. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే ఈసారి విక్రయాలు 21 శాతం పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ జనవరి-సెప్టెంబర్లో 1,96,227 యూనిట్లు అమ్ముడైనట్టు వివరించింది. నిరుడు 1,61,575 యూనిట్లుగానే ఉన్నట్టు పేర్కొన్నది. ఈ క్రమంలో 2022లో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఈ ఏడాది ఇప్పటికే 91 శాతం జరిగిపోయాయన్నది. గత ఏడాది 2,15,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయని, దీంతో ఈ ఏడాది అంతకుమించే నమోదు కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వచ్చే పండుగ సీజన్ ఇందుకు కలిసిరాగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది. ఇదిలావుంటే ఈ జనవరి-సెప్టెంబర్లో కొత్త అపార్ట్మెంట్ల ద్వారా అందుబాటులోకి వచ్చిన ఫ్లాట్లు కూడా 21 శాతం ఎగిసి 2,23,905 యూనిట్లుగా ఉండటం గమనార్హం. నిరుడు 1,84,317 యూనిట్లుగానే ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాలపై జేఎల్ఎల్ తాజా నివేదిక విడుదలైంది. గృహ రుణాలపై వడ్డీరేట్లు స్థిరంగా ఉండటం మార్కెట్కు కలిసొస్తున్నదని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ విభాగం అధిపతి శివ కృష్ణన్ చెప్పారు.