70 ఏండ్లకు పెంచాలని పీఎఫ్ఆర్డీఏ ప్రతిపాదన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరేందుకున్న వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ సూచించింది. అంతేకాకుండా 60 ఏండ్ల వయసు దాటిన తర్వాత ఈ పథకంలో చేరినవారిని 75 ఏండ్ల వయసు వరకు ఎన్పీఎస్ ఖాతాలను కొనసాగించుకునేందుకు అనుమతించడంతోపాటు కనీస గ్యారంటీ పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. మరోవైపు రిటైర్మెంట్ తర్వాత వచ్చే నిధిలో 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ కొనుగోలు కోసం విధిగా పెన్షన్ ఫండ్ మేనేజింగ్ సంస్థలో పెట్టి మెరుగైన లాభాలను పొందేలా చందాదారులకు అవకాశాన్ని కల్పించేందుకు పీఎఫ్ఆర్డీఏ కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న యా న్యుటీని తప్పనిసరి ప్రాతిపదికపై కొనుగోలు చేయాలంటే రిటైర్మెంట్ నాటికి లేదా 60 ఏండ్ల వయసు నాటికి చందాదారులు రూ.2 లక్షలకుపైగా కార్పస్ను కలిగి ఉండాలి.