PF Rule Change | మీరు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో సభ్యులా.. అయితే.. ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలతో మీ ఆధార్ నంబర్ను సెప్టెంబర్ ఒకటో తేదీ లోగా అనుసంధానించుకోవాలి. యాజమాన్యం నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్లు, ఇతర బెనిఫిట్లు పొందాలంటే ఈపీఎఫ్వో సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా తమ పీఎఫ్ యూఏఎన్ (విశ్వజనీన ఖాతా నంబర్)తో ఆధార్ నంబర్ అనుసంధానించాల్సిందే. ఇంతకుముందు జూన్ ఒకటో తేదీ వరకు ఉన్న గడువును సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు పొడిగించింది కేంద్ర కార్మికశాఖ.
కార్మికశాఖ గతేడాది సోషల్ సెక్యూరిటీ కోడ్ను సవరించిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని 142 సెక్షన్ సాయంతో సదరు ఉద్యోగి లేదా కార్మికుడు అసంఘటిత రంగంలో ఉన్నాడా.. లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఈ కోడ్ ద్వారా ఇతరులెవరైనా బెనిఫిట్లు పొందుతున్నారా? అన్న విషయం అర్థమవుతుంది.
పీఎఫ్ యూఏఎన్తో ఆధార్ లింకింగ్ తప్పనిసరి.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈపీఎఫ్వో సబ్స్క్రైబర్లు తమ పీఎఫ్ యూఎఎన్ నంబర్తో ఆధార్ అనుసంధానించకుంటే యాజమాన్యం నుంచి పీఎఫ్ వాటా పొందలేరు.
అసంఘటిత, సంఘటిత రంగాలతోపాటు ఇతర రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించేందుకు తీసుకొచ్చిందే సోషల్ సెక్యూరిటీ కోడ్-2020. అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు ఆధార్తో అనుసంధానించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు వివిధ ప్రభుత్వ పథకాల బెనిఫిట్లు వారికి చేరతాయి.
ఉద్యోగులు, కార్మికుల పీఎఫ్ యూఏఎన్ ఖాతాలతో వారి ఆధార్ నంబర్ అనుసంధాన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాలదేనని ఈపీఎఫ్వో జారీ చేసిన నోటిషికేషన్లో పేర్కొంది. ఒకవేళ ఆధార్ అనుసంధానించని కార్మికులకు యాజమాన్యం విడిగా ఎలక్ట్రానిక్ చలాన్ కం రిసిప్ట్ లేదా పీఎఫ్ రిటర్న్ దాఖలు చేస్తుంది.