Petro Bill | గతేడాది కరోనా మహమ్మారి ప్రజలందరిని వణికిస్తున్న వేళ పెట్రోల్, డీజిల్లపై రికార్డు స్థాయిలో విధించిన దిగుమతి సుంకాలు కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రభుత్వ ఖజానాకు సుంకాలు, పన్నులు, సెస్ల రూపేణా రూ.4.55 లక్షల ఆదాయం లభించింది. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ ఇచ్చిన సమాధానంలో చెప్పారు.
అదే సమయంలో పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2.02 లక్షల ఆదాయం లభించిందని రామేశ్వర్ తెలీ తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.25,430 కోట్లు, ఉత్తరప్రదేశ్కు రూ.21,956 కోట్లు, కర్ణాటకకు రూ.15,476 కోట్లు, గుజరాత్కు రూ.15,141కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దేశీయ మార్కెట్లో చమురు ధరలు చుక్కలనంటడంతో ఇటీవల వీటిపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీని కొనసాగింపుగా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడంతో వినియోగదారులకు కాసింత రిలీఫ్ లభించింది.