Paytm | పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు శుక్రవారం ఐదు శాతం లబ్ధితో అప్పర్ సర్క్యూట్ లిమిట్ను దాటాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకు ద్వారా యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు నేషనేల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. బీఎస్ఈలో పేటీఎం స్టాక్ ఐదు శాతం పుంజుకి రూ.370.90 వద్ద అప్పర్ సర్క్యూట్ లిమిట్ను దాటింది. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా ఐదు శాతం పెరిగి రూ.370.70 వద్దకు దూసుకెళ్లింది. దీంతో పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,567.50 కోట్ల వద్ద నిలిచింది.
పేటీఎం యూజర్లు చెల్లింపులు యధావిధిగా కొనసాగించేందుకు ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్ల ద్వారా యూపీఐ లావాదేవీల నిర్వహణకు పేటీఎంకు గురువారం ఎన్పీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 15 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ లావాదేవీలు, టాపప్ లావాదేవీలు జరుపొద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు బ్యాంకుల ద్వారా యూపీఐ లావాదేవీల నిర్వహణకు పేటీఎంకు థర్డ్ పార్టీ అప్లికేషన్ లైసెన్స్ ఎన్పీసీఐ మంజూరు చేసింది.
మార్చి 15 తర్వాత పీపీబీఎల్ ఖాతాదారులు ఇతర బ్యాంకులకు మారిపోవాలని ఆర్బీఐ హితవు తెలిపింది. పీపీబీఎల్ సుమారు 30 కోట్ల వాలెట్లు, మూడు కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. పీపీబీఎల్లో వన్97 కమ్యూనికేషన్స్కు 49 శాతం వాటాలు ఉన్నాయి. వన్97 కమ్యూనికేషన్స్ ఫౌండర్ కం సీఈఓ విజయ్శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉంది.