Paytm Transit Card | ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తన కస్టమర్ల కోసం పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ను ప్రారంభించింది. దీని సాయంతో ప్రతి ఒక్కరూ సులభంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరుపొచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సోమవారం ఈ కార్డును ఆవిష్కరించింది. రైల్వేలు, ఆర్టీసీ, మెట్రో రైళ్ల సర్వీసుల్లోనూ, ఆఫ్లైన్ మర్చంట్ స్టోర్లు, ఆన్లైన్ షాపింగ్ తదితర రోజువారీ అవసరాలకు ఈ ట్రాన్సిట్ కార్డును వినియోగించవచ్చు. అంతే కాదు.. వివిధ బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
డిజిటల్ పద్దతిలోనే పేటీఎం ఆప్లో ఈ ట్రాన్సిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా దరఖాస్తు చేసుకున్న కస్టమర్ ఇంటికే ఈకార్డును డెలివరీ చేస్తారు. ప్రీపెయిడ్ కార్డును పేటీఎం వ్యాలెట్కు కూడా అనుసంధానించుకోవచ్చు. ఈ పేటీఎం ట్రాన్సిట్ కార్డు నిర్దేశిత విక్రయ కేంద్రాల్లోనూ తీసుకోవచ్చు.
ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్, అహ్మదాబాద్ మెట్రో కస్టమర్లకు పేటీఎం ట్రాన్సిట్ కార్డు సేవలందిస్తున్నది. ఈ కార్డుతో రోజూ సుమారు 50 లక్షల మంది మెట్రో, బస్సు, రైలు కనెక్టివిటీ సేవలు పొందొచ్చు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులు కూడా ఈ ట్రాన్సిట్ కార్డు సేవలను వాడుకోవచ్చు. ఆటోమేటిక్గా మెట్రో ప్రయాణ చార్జీలు చెల్లించొచ్చు.
దేశంలో కోటికి పైగా ఫాస్టాగ్లు జారీ చేసిన మైలురాయిని సాధించిన తొలి బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రికార్డు నెలకొల్పింది. ఫాస్టాగ్ విజయవంతమయ్యాక పేటీఎం పేమెంట్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్ల కోసం ట్రాన్సిట్ కార్డు అందుబాటులోకి తెచ్చింది. లక్షలాది మంది అన్ని రకాల బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్ సేవలను అందుబాటులోకి తేవడానికి ఈ ట్రాన్సిట్ కార్డును ఆవిష్కరించామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సతీశ్ గుప్తా తెలిపారు.