హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ( FCRI ) కు మరో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం పోటీలో ములుగు ఫారెస్ట్ కాలేజీ గ్రీన్ ఛాంపియన్గా నిలిచింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా – ఒక పచ్చని విజేత (One District – One Green Champion) అవార్డును ములుగు ఫారెస్ట్ కాలేజీ సాధించింది.
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో జిల్లా నుంచి ఒక సంస్థను పరిశుభ్రత, పచ్చదనం పెంపు నిర్వహణ బాగా చేస్తున్న వాటిని గుర్తించారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ అవార్డును దక్కించుకుంది. కొత్త క్యాంపస్ ఏర్పాటైన ఏడాది కాలంలోనే స్వచ్చత, పచ్చదనంలో ఫారెస్ట్ కాలేజీ గణనీయమైన వృద్దిని సాధించింది. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు ఈ ఘనతలో భాగస్వామ్యం అయ్యారు. జాతీయ స్థాయిలో ఈ గుర్తింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, ఫ్యాకల్టీ, విద్యార్థుల పట్టుదల కారణమని ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీన్ అన్నారు. మరో సారి ఫారెస్ట్ కాలేజీకి జాతీయస్థాయి గుర్తింపు దక్కడంతో డీన్, సిబ్బంది, విద్యార్థులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు.