Paytm | ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం భారీ నష్టాలకు గురవుతున్నది. గతేడాది ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్ కోల్పోయింది. మంగళవారం స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ రూ.476.65లతో ఆల్టైం కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.477.1 వద్ద నిలిచింది. గత సెషన్తో పోలిస్తే 11 శాతానికి పైగా పేటీఎం షేర్ పతనమైంది. స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా ఎం-క్యాప్ కోల్పోయిన పేటీఎం ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.30,971 కోట్లకు సమీపంలో ఉంది.
ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పుడు పేటీఎం షేర్ విలువ రూ.2,150గా నిర్ణయించారు. నాటి నుంచి దాదాపు 78 శాతం పతనమైంది. ఐపీవోకి వెళ్లినప్పటి నుంచి పేటీఎం ఎం-క్యాప్ రూ.1.38 లక్షల కోట్ల పై చిలుకు హరించుకుపోయింది. కేవలం ఏడాది కాలంలో పేటీఎం షేర్ 77 శాతం నష్టపోయింది. లిస్టింగ్ నాటికి పేటీఎం ఎం-క్యాప్ రూ.1.01 లక్షల కోట్లుగా నిర్ధారిస్తే.. ఇప్పటి వరకు 69 శాతానికి పైగా కోల్పోయింది.
గతేడాది నవంబర్ 18న పేటీఎం.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీవోకి వెళ్లినప్పుడు సంస్థ షేర్ రూ.2,150గా నిర్ణయిస్తే, 9 శాతం డిస్కౌంట్పై ఇన్వెస్టర్లకు రూ.1,950లకు అందుబాటులో ఉంచారు. అదే రోజు పేటీఎం సేర్ 27 శాతం పతనమైంది. లిస్టింగ్ ధర కంటే రూ.1,564కు పలికింది. ఈ నెల 15తో పేటీఎం లాకిన్ పీరియడ్ ముగిసింది.