హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ కంపెనీలకు మార్కెటే మంచి గురువని, క్షేత్ర స్థాయిలో మార్కెట్పై లోతైన అధ్యయనం చేయడం ద్వారానే ఎన్నో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ర్యాపిడో వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో భారతీయ వ్యాపార రంగంలో వృద్ధి పథంలో ఉన్న మూడు ప్రముఖ స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు.
ఫిక్కీ ఎఫ్ఎల్వో చైర్పర్సన్ శుభ్ర మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పాలసీ బజార్ వ్యవస్థాపకులు అలోక్ భన్సల్, ర్యాపిడో బైక్ వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి, స్కైరూట్ సహ వ్యవస్థాపకులు పవన్ చందనలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ ‘చాలా మంది వద్ద సరికొత్త ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నం చేయరు.. ర్యాపిడోకు ముందు 6 రకాల వ్యాపారాలను ప్రారంభించినా అవి విజయవంతం కాలేదు.
అదే ప్రయత్నంలోనే బైకుల వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ ఈ సేవలను ద్వితీయ, తృతీయ నగరాల్లో విస్తరించేందుకు 3 ఏళ్ల సమయం పట్టింది’ అన్నారు. ఈ తర్వాత నాలుగో ఏడాది ఏకంగా దేశంలోని 65 నగరాలకు విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా తన అనుభవాలను వెల్లడించారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకులు పవన్ చందన మాట్లాడుతూ.. ఇస్రోలో పనిచేసిన 6 ఏళ్లలో రాకెట్లకు, ఉపగ్రహాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ను గుర్తించి, సొంతంగా 4 ఏళ్ల క్రితమే స్కైరూట్ను ప్రారంభించి, మొదటి ప్రయత్నంలోనే రాకెట్ను విజయవంతంగా ప్రయోగించామన్నారు. కాగా రాకెట్లు, శాటిలైట్ల తయారీ అంటే చాలా పెట్టుబడి అవసరం, దాని కోసం చాలా ప్రయత్నాలు చేశామని తెలిపారు.