Baba Ramdev- Supreme Court | యోగా గురు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరు కావాలని మంగళవారం ఆదేశించింది. డ్రగ్స్ అండ్ రెమెడిక్స్ యాక్ట్ లోని 3,4 సెక్షన్లను రాందేవ్ బాబాతోపాటు పతంజలి ఆయుర్వేద్ సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఉల్లంఘించినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి ఆయుర్వేదంపై దేశవ్యాప్తంగా వాణిజ్య ప్రకటనలు జారీ చేసినందుకు తాము జారీ చేసిన షోకాజ్ కంటెంప్ట్ పిటిషన్’కు వివరణ ఇవ్వడానికి బదులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్ ఆదేశించింది.
అన్నిరకాల వ్యాధుల నివారణకు పతంజలి ఆయుర్వేద్ మందులు పని చేస్తాయంటూ దేశవ్యాప్తంగా వాణిజ్య ప్రకటనలు జారీ చేయొద్దని రాందేవ్ బాబాను ఇంతకుముందు విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ప్రకటనలు చేయొద్దని పతంజలి ఆయుర్వేద్, దాని అధికారులను గత నవంబర్ 21న హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు పతంజలి ఆయుర్వేద్ సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది.