ముంబై, జనవరి 23: ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విభాగంలో 18-20 శాతం వృద్ధికి వీలుందని మంగళవారం క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ తమ నివేదికలో అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ ఈ వృద్ధి కొనసాగవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటం, ఇప్పటికే ఆర్డర్లు భారీగా వచ్చిన నేపథ్యంలో ఈ రిపోర్టు విడుదలైంది.
కాగా, ప్రీమియం వేరియంట్లకు డిమాండ్ ఉంటుందని, అయితే ఎంట్రీ లెవల్ వేరియంట్లకు అంతగా ఆదరణ ఉండకపోవచ్చని కేర్ఎడ్జ్ మార్కెట్ ట్రెండ్ను విశ్లేషిస్తున్నది. ఇక ఎలక్ట్రిక్ ఫోర్వీలర్ సెగ్మెంట్లో గత కొన్నేండ్లుగా అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయని పేర్కొన్నది. మొత్తం ఈవీ మార్కెట్ సేల్స్లో దాదాపు 6 శాతం వాటా వీటిదేనని చెప్పింది.
ఈ క్రమంలోనే ప్రధాన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం) మున్ముందు మరిన్ని ఈవీలను మార్కెట్కు పరిచయం చేయడంపై దృష్టి పెడుతున్నట్టు కేర్ఎడ్జ్ రిసెర్చ్ డైరెక్టర్ తన్వీ షా తెలిపారు. భారతీయ వాహన విక్రయాల్లో పీవీ సేల్స్ వాటా 18 శాతంగా ఉన్నది. ఈ క్రమంలో గతంతో పోల్చితే నిరుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 25 శాతానికి పెరిగిందన్నారు. మరోవైపు డిమాండ్కు తగ్గట్టుగా వాటి ధరల్నీ ఆయా సంస్థలు పెంచుతూపోతున్నాయి.