Cars Sales | రోజురోజుకు దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే ఎన్నడు లేని విధంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 10,74,189 కార్ల హోల్ సేల్ విక్రయాలు జరిగాయని విక్రయించినట్లు ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) తెలిపింది. 2022-23లో ఇదే కాలంలో 10,26,309 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.7 శాతం గ్రోత్ నమోదైంది. ఇక ఒక ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కార్ల విక్రయాలు 20 లక్షలు దాటడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 20,70,163 కార్లు అమ్ముడు కాగా, గతేడాది 19,36,804 యూనిట్లు అమ్ముడు పోయాయని సియామ్ తెలిపింది. దీనికి యుటిలిటీ, ఎస్యూవీలకు గిరాకీ పెరగడమే కారణం అని పేర్కొంది.
కానీ, ఇంతకుముందుతో పోలిస్తే ఎంట్రీ లెవల్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయని సియామ్ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసింలో గరిష్టంగా 1.38 లక్షల ఎంట్రీ లెవల్ కార్లు అమ్ముడైతే.. ఈ ఏడాది 35 వేల యూనిట్లకే పరిమితం అయ్యాయని వెల్లడించింది.
త్రీ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ సేల్స్లోనూ గ్రోత్ నమోదైనా టూ వీలర్స్ సేల్స్ తగ్గాయని సియామ్ పేర్కొంది. గతేడాది జూలై- సెప్టెంబర్ మధ్య 46,73,931 టూ వీలర్స్ అమ్ముడైతే, ఈ ఏడాది 45,98,442 యూనిట్లు అమ్ముడు పోయాయని వివరించింది. త్రీ వీలర్స్ సేల్స్ 1,20,319 నుంచి 1,95,215 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ వెహికల్స్ సేల్స్ 2,31,991 నుంచి 2,47,929 యూనిట్లు పెరిగాయని సియామ్ తెలిపింది.