న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే ప్రయాణ వాహనాల విక్రయాలు 45 శాతం పెరిగాయి. 2020 జూలైలో 1.85 లక్షల యూనిట్లు అమ్ముడైతే ఈ ఏడాది అవి 2.64 లక్షల యూనిట్లకు పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది.
గతేడాది ప్యాసింజర్ కార్లు 1.02 లక్షలు అమ్ముడైతే ఈ ఏడాది అవి 1.3 లక్షలకు చేరాయి. 2019లో ప్యాసింజర్ కార్ల విక్రయాలు 1.16 లక్షలుగా ఉన్నాయి. 2021లో యుటిలిటీ వెహికల్స్ సేల్స్ 1.24 లక్షలు ఉంటే, 2020లో 71,384, 2019లో 62,681 యూనిట్లుగా ఉన్నాయి.
2020లో 12.81 లక్షల టూ వీలర్స్ అమ్ముడైతే ఈ ఏడాది జూలైలో 12.53 లక్షలకు చేరాయి. 2019లో 15.11 లక్షల ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశారు. దేశీయంగా గతేడాది 14.76 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయిస్తే ఈ ఏడాది జూలైలో 15.36 లక్షల యూనిట్లకు చేరాయి. 2019లో అది 17.57 లక్షల వాహనాలను విక్రయించారు.
ఇప్పటికీ ఆటోమొబైల్ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటున్నదని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అంతర్జాతీయంగా సెమీ కండక్టర్ల కొరత, శరవేగంగా కమొడిటీ ధరల పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరోవైపు భారత్తోపాటు ప్రపంచంపై కరోనా థర్డ్ వేవ్ ముప్పును నిశితంగా పరిశీలిస్తున్నదన్నారు.