న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆరోగ్య బీమా, మైక్రోఇన్సూరెన్స్పై పన్ను భారం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలపై ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ.. హెల్త్ ఇన్సూరెన్స్, మైక్రోఇన్సూరెన్స్లపై ప్రస్తుతం పడుతున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 18 శాతం దిగువకు చేర్చాలని సిఫార్సు చేసింది. సీనియర్ సిటిజన్ల కోసం ఆరోగ్య బీమా, మైక్రోఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీకి కోత పెట్టాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ‘బీమా పాలసీలపై ముఖ్యంగా ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్పై జీఎస్టీ రేటును హేతుబద్దీకరించాల్సిన అవసరం ఉన్నదని కమిటీ భావించింది. ప్రస్తుతం వీటిపై 18 శాతం పన్ను పడుతున్నది. అధిక జీఎస్టీ రేటుతో అధిక ప్రీమియంల భారాన్ని మోయాల్సి వస్తున్నది. దీనివల్ల బీమా పాలసీలకు కొందరు దూరం అవుతున్నారు’ అని ‘బీమా రంగ నియంత్రణ, పనితీరు సమీక్ష’పై ఇచ్చిన నివేదికలో పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొన్నది. బీమాను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, అందుకే ఆరోగ్య బీమా ఉత్పత్తులపై వర్తిస్తున్న జీఎస్టీ రేట్లను, ముఖ్యంగా వృద్ధుల కోసం రిటైల్ పాలసీలపై, మైక్రోఇన్సూరెన్స్-టర్మ్ పాలసీలపై పన్ను భారాన్ని తగ్గించాలన్నది.
ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని కమిటీ ఈ సందర్భంగా చెప్పింది. ఆయా సంస్థలు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయన్నది. దివాలా ముప్పూ పొంచి ఉన్నట్టు తెలిపింది. 2016-17 నుంచి 2020-21 వరకు ఐదేండ్లలో రూ.26,000 కోట్ల నష్టాలను చూసినట్టు వివరించింది. దీంతో ఈ నష్టాల ఊబిలో నుంచి కంపెనీలను బయటపడేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.
సమాజంలో ఆరోగ్య, జీవిత, పంటలు తదితర అంశాలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్న పేద, అల్పాదాయ వర్గాల భద్రత, ఆర్థిక రక్షణ కోసం మరిన్ని కొత్త మైక్రోఇన్సూరెన్స్ ఉత్పత్తులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఇందుకు రూ.100 కోట్ల మూలధన నిల్వల అవసరం ఉండొచ్చని అంచనా వేసింది.
మోటర్ ఇన్సూరెన్స్కు ప్రాధాన్యతనిచ్చేలా ఆర్థిక సంస్థలు తమ రుణాల మంజూరు సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఈ మేరకు అటు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ, ఇటు బ్యాంకింగ్ రంగ రెగ్యులేటర్ ఆర్బీఐ తగిన చర్యలు చేపట్టాలన్నది.