హైదరాబాద్, అక్టోబర్ 13: దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్కు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన పారెక్సల్ ఇక్కడి సిబ్బందిని భారీగా పెంచుకోబోతున్నది. ప్రతియేటా 300 నుంచి 500 మంది వరకు సిబ్బందిని వచ్చే ఐదేండ్ల వరకు రిక్రూట్ చేసుకోనున్నట్టు పారెక్సల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ వ్యాస్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో 6 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, 2028 నాటికి ఈ సంఖ్యను 8 వేలకు చేరుకోనున్నది. హైదరాబాద్లో ఉన్న సెంటర్లో 2,400 మంది విధులు నిర్వహిస్తుండగా, ఈ వారంలో మరో 100 మందిని నియమించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రంలో ఫార్మా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు, వచ్చే ఏడాది హైదరాబాద్లో జరగనున్న బయోఏషియా సదస్సులో క్లినికల్ ట్రయల్స్పై ప్రత్యేక కార్యాక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఒకవేళ వచ్చే సదస్సులో క్లినికల్ ట్రయల్స్పై సదస్సు ఏర్పాటు చేస్తే పారెక్సల్ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్లో క్లినికల్ ట్రయల్ పరిశ్రమ 2.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నదని, ప్రతియేటా రెండంకెల వృద్ధితో 2028 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్లో తమ పరిశోధనలు జరిపించుకోవడానికి 500 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.