న్యూఢిల్లీ, జూలై 25: అమెరికాకు చెందిన ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ దిగ్గజం పనట్టోని.. హైదరాబాద్లో ఓ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కును ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ పార్కు కోసం భూముల సమీకరణలో సంస్థ నిమగ్నమైంది కూడా. ఇందులో భాగంగానే భూ యజమానులతో కంపెనీ వర్గాలు చర్చల్ని కూడా జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
దాదాపు 50-100 ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కు రావచ్చని సమాచారం. ఈ క్రమంలోనే రూ.400 కోట్ల వరకు పెట్టుబడుల్ని పనట్టోని పెట్టనున్నది. పెట్టుబడుల కోసం విదేశీ సంస్థాగత మదుపరులనూ సంప్రదిస్తున్నది.
భారత్లో గిడ్డంగుల అవసరం పుష్కలంగా ఉందని పనట్టోని ఎండీ సందీప్ చందా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు, తయారీ కంపెనీలకు వీటి అవసరం భారీగా పెరిగిపోయిందని, అందుకే మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు.
ఇక లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు 50-100 ఎకరాల స్థలం ఎంతో అనువుగా ఉంటుందన్న ఆయన.. తమ సంస్థ 25 ఎకరాల్లోనూ నిర్మించగలదని చెప్పారు. త్వరలో రాబోయే పార్కులను సరికొత్త శైలితో, ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. ఇప్పటిదాకా అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో 2,500లకుపైగా క్లయింట్లకు పనట్టోని.. 544 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేసి ఇచ్చింది.
తొలి దశ కింద దేశంలోని ప్రధాన నగరాల్లో నాలుగు ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని పనట్టోని ప్రయత్నిస్తున్నది. ఇందు కోసం సుమారు రూ.1,600 కోట్ల (200 మిలియన్ డాలర్లు) పెట్టుబడుల్నీ పెట్టనున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణెల్లో 250 ఎకరాల స్థలం పొందాలని చూస్తున్నది.
ఆయా నగరాల్లో భూ యజమానులతో సంప్రదింపులూ నడుస్తున్నట్టు చెప్తున్నారు. భారతీయ పార్కులతోనే ఆసియా మార్కెట్లో విస్తరించడాన్ని మొదలుపెట్టాలని కంపెనీ అనుకుంటున్నది. కాగా, బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనట్టోని ఇండియా విభాగం పనట్టోని ఇండియా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తున్నది.