PAN card | ప్రభుత్వ నిర్దేశిత సంస్థల్లో అన్ని రకాల డిజిటల్ వ్యవస్థల్లో పాన్ కార్డును ఉమ్మడి గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బుధవారం ఆమె లోక్సభలో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశ పెడుతూ ఈ సంగతి చెప్పారు. `అన్ని డిజిటల్ వ్యవస్థల్లో పాన్ కార్డును ఉమ్మడి గుర్తింపు కార్డుగా వాడటం వల్ల `ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్`ను మరింత ప్రోత్సహించడానికి ఉపకరిస్తుంది. ఒక వ్యక్తికి, సంస్థకు, కంపెనీకి ఆదాయం శాఖ విభాగం కేటాయించిన 10-డిజిట్ అల్ఫాన్యూమరిక్ నంబర్ను పాన్ కార్డు అంటారు` అని తెలిపారు.
కాంట్రాక్ట్ పనుల పర్యవేక్షణలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు విఫలమైతే, వివాద్ సే విశ్వాస్ పథకం కింద ఆయా సంస్థలకు ఇచ్చిన 95 శాతం గ్యారంటీ ఉపసంహరించుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను వివాదాలు, పెనాల్టీ, వడ్డీ సంబంధిత వివాదాల పరిష్కారానికి వివాద్ సే విశ్వాస్ పథకం అమలవుతుందన్నారు. 100 శాతం పన్ను చెల్లింపు, 25 శాతం పెనాల్టీ లేదా వడ్డీ చెల్లింపుపై వివాదం నెలకొంటే వివాద్ సే విశ్వాస్ పథకం కింద పరిష్కరిస్తామని తెలిపారు. మూడో దశ ఈ-కోర్టులు ప్రారంభిస్తామన్నారు. నీతి ఆయోగ్ స్టేట్ సపోర్ట్ మిషన్ మూడేండ్లు కొనసాగిస్తామన్నారు.