గడువులు ముంచుకొస్తున్నాయ్. ఈ నెలలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి గుర్తుంచుకోండి. ఏ కారణం చేతనైనా చేయలేకపోతే.. పర్సనల్ ఫైనాన్స్ తలకిందులయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా వీటిని మాత్రం వెంటనే పూర్తి చేయండి.
పాన్ ఆధార్ లింక్
పాన్ నంబర్తో ఆధార్ను లింక్ చేయడానికి ఈ నెల 30వ తేదీనే చివరి తేదీ. ఒకవేళ చేయలేకపోతే పాన్ నంబర్ చెల్లుబాటు కాదు. దాంతో మరే ఆర్థిక లావాదేవీలను చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు కొనాలన్నా పాన్ నంబర్ తప్పనిసరి. ఒకవేళ పాన్ నంబర్ రద్దు కావడమో లేదా స్తంబింపచేస్తే ఈ పనులేవీ చేయలేరు. సెప్టెంబర్ 30 తర్వాత రూ.10,000 జరిమానా ఉంటుంది. పాన్-ఆధార్ లింక్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో చేసుకోవచ్చు.
డీమ్యాట్ అకౌంట్ కేవైసీ
ఇన్వెస్టర్లందరూ సెప్టెంబర్ 30లోగా డీమ్యాట్ అకౌంట్ను తాజా కేవైసీ వివరాలతో అప్డేట్ చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్దేశించింది. పేరు, అడ్రస్, ఆదాయం, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్, పాన్ నంబర్లతో కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఇప్పటికే ఈ గడువును జూలై 31 నుంచి పొడిగించారు. అప్డేట్ చేయకపోతే అకౌంట్ డీయాక్టివేట్ చేస్తారు.
ఐటీఆర్ దాఖలు
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి కూడా ఈ నెలాఖరే చివరి తేదీ. కొవిడ్ కారణంగా ఇప్పటికే ఈ గడువును జూలై 31 నుంచి పొడిగించింది ఐటీ శాఖ. ఆలస్యంగా ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానాతో దాఖలు చేయాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్
కార్డుతో జరిపే లావాదేవీలకు మరింత సెక్యూరిటీ కల్పించేందుకుగాను మొబైల్ నంబర్తో ధ్రువీకరణ ఇక నుంచి తప్పనిసరి. ఈ నెల 30లోగా బ్యాంక్ ఖాతాతో మొబైల్ నంబర్ను ఖాతాదారులంతా లింక్ చేయాలి. అలాగే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్లు, ఎస్ఐపీలు ఇతర నెలసరి ఆటో డెబిట్ చెల్లింపులు జరగాలంటే మొబైల్ నంబర్ లింకేజి తప్పనిసరి. దీనివల్ల ప్రధానంగా ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్టవేయడంతోపాటు సులభంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుకోవచ్చునని ఆర్బీఐ భావిస్తున్నది.