Pakistan-India Car Sales | కరోనా మహమ్మారి తర్వాత భారత్లో దాదాపు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏయేటికాయేడు వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. భారత్లో ప్రస్తుతం నెలకు 3.6 లక్షల వాహనాల విక్రయంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నది. కానీ మన దాయాది దేశం పాకిస్థాన్లో రోజురోజుకు పరిస్థితి అడుగంటిపోతున్నది. వరుసగా రెండో నెల నవంబర్లో వాహనాల విక్రయాలు తగ్గిపోయాయి. 2022 నవంబర్లో 15,432 యూనిట్ల వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 4,875 వాహనాలు మాత్రమే అమ్ముడు పోయాయి. గతేడాదితో పోలిస్తే 68 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని పాకిస్థాన్ ఆటోమోటివ్ మాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్ (పామా0 తెలిపింది.
కార్లు, మోటారు సైకిళ్ల తయారీకి ఇన్ పుట్ కాస్ట్, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో తగ్గిన గిరాకీ, వాహనాల కొనుగోళ్లపై అధిక పన్నుల వడ్డింపు తదితర కారణాల వల్ల పాకిస్థానీయులు వాహనాల కొనుగోలుకు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. అందుకు భిన్నంగా భారత్లో కేవలం నవంబర్ నెలలోనే 3.6 లక్షలకు పైగా కార్లు అమ్ముడు పోయాయి. ప్రతి గంటకు 500లకు పైగా కార్లు అమ్ముడయ్యాయని ఫాడా వెల్లడించింది.
భారత్తోపాటు దక్షిణాసియా దేశాల్లో శరవేగంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ దూసుకెళ్తుండగా, పాకిస్థాన్ రోజురోజుకు కష్టాలను ఎదుర్కొంటున్నది. టెస్లా, బీవైడీ, జీడబ్ల్యూఎం వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు పాకిస్థాన్లో కార్ల తయారీ కార్యకలాపాలు నిలిపేసి, భారత్ మార్కెట్లో ఎంటర్ కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.