ముంబై: రూ.100 సంపాదిస్తే రూ.35 ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వస్తున్నదని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగంపై ప్రభుత్వ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. స్థూల సర్దుబాటు ఆదాయం (ఏజీఆర్), స్పెక్ట్రం చెల్లింపులు టెలికం సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టివేశాయని పేర్కొన్నారు. టెలికం రంగంపై ఉన్న భారం తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో 5జీ సేవల వినియోగం ప్రారంభం అవుతుందని సునీల్ మిట్టల్ తెలిపారు. అయితే, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా అది నిజమవుతుందన్నారు. 5జీ సేవల ధరలు ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. 5జీ వినియోగ ఫోన్ల ధరలు కూడా దిగి వస్తాయని తెలిపారు. నెలకు అర్పు రూపంలో రూ.200 ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సమయం వచ్చినప్పుడు టారిఫ్ రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.