Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఏడాది తర్వాత 100 డాలర్ల క్లబ్లో చేరారు. గతేడాది ప్రారంభంలో అదానీ గ్రూప్పై షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండర్ బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలు చేసింది. స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, మోసాలతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 2.7 బిలియన్ డాలర్ల నుంచి 100.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని హిండెన్ బర్గ్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత సంపద, అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయాయి. హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ నిరాకరించింది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ సంస్థ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ వరుసగా ఎనిమిదో రోజు (బుధవారం) పుంజుకున్నది. నికర లాభాల్లో 130 శాతం పురోగతి సాధించినట్లు ప్రకటించడంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ పెరిగింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతం అదానీ 12వ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 11వ స్థానంలో కొనసాగుతున్నారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద ఈ నెల ప్రారంభంలో గరిష్ట రికార్డు స్థాయికి చేరుకోగా, 2022 నాటి గరిష్ట రికార్డు కంటే గౌతం అదానీ వ్యక్తిగత సంపద 50 బిలియన్ డాలర్లు తక్కువే కొనసాగుతున్నది. 101 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో గౌతం అదానీ 12వ స్థానానికి చేరుకున్నారు. 2022లో 150 బిలియన్ డాలర్లతో కొనసాగిన గౌతం అదానీ వ్యక్తిగత సంపద.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో సుమారు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోవడంతోపాటు తొలి 25 మంది కుబేరుల జాబితాలో ఆయన స్థానం కోల్పోయారు.