ముంబై, ఫిబ్రవరి 6: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 68 పైసలు పడిపోయింది. దేశ, విదేశీ స్టాక్ మార్కెట్ల నష్టాలు, భారత్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, క్షీణిస్తున్న మదుపరుల సెంటిమెంట్.. రుపీ విలువను దిగజార్చాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ముగింపుతో చూస్తే 68 పైసలు కోల్పోయి 82.76 వద్ద నిలిచింది. శుక్రవారం 82.08 వద్ద ఉన్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 0.45 శాతం ఎగిసి 80.30 డాలర్లకు చేరింది. ఇక శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ).. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.932.44 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు అటు సెన్సెక్స్ సోమవారం 335 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయాయి. చైనా, హాంకాంగ్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలూ నిరాశపర్చాయి.