IT Returns | గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి చివరి రోజు ఆదివారం (జూలై 31) రాత్రి 11 గంటల వరకు 67,97,067 లక్షల మంది ఐటీఆర్లు దాఖలు చేశారు. అర్ధరాత్రి వరకు అంటే మరో గంట సమయం ఉన్నందున మరికొంత మంది దాఖలు చేయవచ్చు. వేతన జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్) గత ఆర్థిక సంవత్సర ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదివారంతో గడువు ముగిసింది. శనివారం నాటికి 5.10 కోట్ల మందికి పైగా ఐటీఆర్లు సబ్మిట్ చేశారు. దీని ప్రకారం గడువు ముగిసే సమయానికి 5.77 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలు చేశారు. ఆదివారం రాత్రి 10 గంటల వరకు 63.47 లక్షల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.
ఇంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2021 డిసెంబర్ 31 నాటికి సుమారు 5.89 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2019-20, 2020-21ల్లో కొవిడ్-19, ఐటీ విభాగం కొత్త ఈ-పోర్టల్లో సమస్యల వల్ల ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించారు. కానీ ఈ ఏడాది గడువు పొడిగించేది లేదని నెల రోజులుగా ఐటీ విభాగం, కేంద్రం ఆర్థిక శాఖ స్పష్టం చేస్తూ వచ్చాయి. గడువులోగా ఐటీఆర్లు దాఖలు చేయకుంటే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది ఐటీ విభాగం.
వేతన జీవులు సజావుగా ఐటీఆర్లు దాఖలు చేయడానికి ఆదాయం పన్ను విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ నంబర్లు 1800 103 0025, 1800 419 0025తోపాటు orm@cpc.incometax.gov.in అనే ఈ-మెయిల్ అందుబాటులో ఉంచింది.
గడువు దాటిన తర్వాత ఐటీఆర్లు దాఖలు చేసేవారు రూ.5 లక్షలకు పైగా ఆదాయం గల వారు రూ.5000, రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు లేట్ ఫీజుతో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. అయితే చెల్లించాల్సిన పన్నుపై ఒకశాతం వడ్డీ చెల్లించాలి. ప్రతి నెలా ఐదో తేదీ తర్వాత ఫైల్ చేస్తే.. ఆ నెల మొత్తానికీ వడ్డీ పే చేయాల్సి రావచ్చు. పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్న వారికి లేట్ ఫీజు వర్తించదు.