న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..మరో మూడు మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 190 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1,09,999గా నిర్ణయించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఏప్రిల్ నుంచి అందచేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బ్యాటరీ వ్యారెంటీని ఎనిమిదేండ్లు లేదా 80 వేల కిలోమీటర్లు వరకు పొడిగించింది. బ్యాటరీ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కస్టమర్లకు ఇది ఊరటనిచ్చే అంశమని ఓలా సీఎండీ భావిష్ అగర్వాల్ తెలిపారు.
నూతన ఎస్1 ఎక్స్ 4కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్తో 190 కిలోమీటర్లు, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చునని తెలిపింది. కేవలం 3.3 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. చార్జింగ్ ఇబ్బందులను అధిగమించడానికి చార్జింగ్ పాయింట్లను పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం విడుదల చేసిన వాటిలో 4కిలోవాట్ల సామర్థ్యం కలిగిన స్కూటర్ ధర రూ.1,09,999 కాగా, 3 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.89,999, 2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర రూ.79,999గా నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 414 సర్వీస్ సెంటర్లు ఉండగా, వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్యని 600కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది.