Ola EV Car in 2024 | గతేడాది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్.. తాజాగా ఎలక్ట్రిక్ కారు తయారీపై ఫోకస్ చేసింది. 2024లో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు వస్తాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సోమవారం వర్చువల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. కేవలం నాలుగు సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్ అందుకోగల సామర్థ్యం దీని సొంతం అని అన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ. దూరం ఈ కారు ప్రయాణిస్తుందన్నారు.
తమిళనాడులోని పోచంపల్లిలో గల ఫ్యూచర్ ఫ్యాక్టరీని విస్తరిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. దీన్ని భారతదేశంలోనే అతిపెద్ద ఈవీ ఆటో హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 100 ఎకరాల విస్తీర్ణంలో లిథియం ఐయాన్ సెల్ ప్లాంట్, 200 ఎకరాల్లో ఈవీ కార్ ప్లాంట్, అదనంగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఈవీ స్కూటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పోచంపల్లిలో తమ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఏటా ఓలా స్కూటర్ ఫ్యాక్టరీ కోటి స్కూటర్లు ఉత్పత్తి చేస్తుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లు, ఓలా గిగా ఫ్యాక్టరీ 100 జీడబ్ల్యూహెచ్ సెల్స్ తయారు చేస్తుందన్నారు. దేశంలోని 50 ప్రధాన నగరాల పరిధిలో 100కి పైగా హైపర్ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
తాజాగా ఆల్-న్యూ ఓలా ఎస్1 స్కూటర్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.99,999గా నిర్ణయించారు. రూ.499లకే త్వరితగతిన బుకింగ్ చేసుకున్న కొద్ది మందికి మాత్రమే ఈ ధరకు అందించనున్నది. టెస్లా వంటి ఎలక్ట్రిక్ కార్లు పాశ్చాత్య దేశాలకు సూట్ అవుతాయన్నారు భవిష్ అగర్వాల్. ఈవీ మార్కెట్లో భారత్లో బుల్లి కార్లు, స్కూటర్లు, మోటార్ బైక్లు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. గత ఏడు నెలల్లో 70 వేలకు పైగా టూ వీలర్స్ను విక్రయించామన్నారు.