Ola Electric | ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో రికార్డు నమోదు చేసింది. 500 కోట్ల విలువ గల తొలి ఎలక్ట్రిక్ కంపెనీగా నిలిచింది. టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునుటీ ఫండ్, ఎడెల్వీస్ తదితర కంపెనీల నుంచి 20 కోట్ల డాలర్ల పెట్టుబడులు సేకరించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతోనే 500 కోట్ల డాలర్ల పెట్టుబడి గల సంస్థగా రికార్డు నమోదు చేసింది. గతేడాది సెప్టెంబర్లోనూ ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్ బ్యాంక్ తదితర సంస్థల నుంచి ఇదే స్థాయిలో పెట్టుబడులను సేకరించింది ఓలా ఎలక్ట్రిక్.
ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ ఏడు సార్లు నిధులు సేకరించింది. హ్యుండాయ్ మోటార్స్, టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా, రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. గత డిసెంబర్లోనూ టెమాసెక్ నేతృత్వంలోని ఫైనాన్సింగ్ రౌండ్ నుంచి 52.7 మిలియన్ల డాలర్లు (రూ.398.26 కోట్లు) సేకరించింది.
కోవిడ్-19 మహమ్మారితో ఓలా క్యాబ్స్ బిజినెస్ నష్టాల్లోకి జారుకున్నది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి 2017లో స్థాపించిన ఓలా ఎలక్ట్రిక్.. కరోనా టైంలో వేగం పుంజుకున్నది. గత ఫిబ్రవరిలో తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్లాంట్ అని పేర్కొన్నది.