Ola Electric-E Auto Riskshaw | ఓలా.. క్యాబ్ సర్వీస్ అగ్రిగేటర్గా.. ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థగా పాపులర్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఈటో రిక్షాను ఆవిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ‘రాహీ (Raahi)’ అనే పేరుతో డెవలప్ చేసిన ఈ ఈ-ఆటో రిక్షాను ఈ నెలాఖరులో మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. మహీంద్రా ట్రియో, పియాగో ఆపే ఈ-సిటీ, బజాజ్ ఆర్ఈ వంటి ఆటో రిక్షాలతో ఓలా ఈ-రాహీ రిక్షా పోటీ పడుతుందని చెబుతున్నారు. వాణిజ్య వాహనాల తయారీ రంగంలోకి ఎంటరయ్యేందుకు కొన్నేండ్లుగా ఓలా ఎలక్ట్రిక్ పని చేస్తున్నది.
కొన్ని నెలల్లో గిగా ఫ్యాక్టరీతోపాటు పలు ప్రకటనలు చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ సిద్ధంగా ఉన్నది. వచ్చే రెండు వారాల్లో ఓలా ఈ-ఆటో రిక్షా ప్రకటన కూడా ఉంటుందని, అయితే ముందుగా నిర్ణయించిన ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండొచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయమై అధికారికంగా స్పందించేందుకు ఓలా ఎలక్ట్రిక్ ముందుకు రాలేదు.
మహీంద్రా, పియాగియో, బజాజ్ ఆటో తయారుచేసిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల మధ్య పలుకుతున్నాయి. ఆయా ఈ-ఆటో రిక్షాల వేరియంట్లను బట్టి ధర ఆధార పడి ఉంటుంది. గతేడాది 5.80 లక్షలకు పైగా ఈ-ఆటో రిక్షాలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వ రవాణాశాఖ వెబ్ సైట్ ‘వాహన్’ తెలిపింది. 2022తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. 2023లో విక్రయించిన ఆటో రిక్షాల్లో 50 శాతానికి పైగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలే ఉన్నాయి.
హిందీలో రాహి (Raahi) అంటే రవాణా వాహనం అని అర్థం. ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళిక రూపొందించింది. ఐపీఓకు వెళ్లేందుకు గత డిసెంబర్ నెలలో సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) సమర్పించింది. ఐపీఓ ద్వారా రూ.5,500 కోట్ల నిధుల సేకరణతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తున్నది.