దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’.. తన కస్టమర్లకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసేవారికి 48 నెలల టెన్యూర్, 8.99 శాతం వడ్డీతో రుణ పరపతి కల్పిస్తున్నట్లు తెలిపింది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ సంస్థ రుణం కోసం ఫాస్ట్ అప్రూవల్స్ లభిస్తాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల పరిధిలో సుమారు 2800 శాఖలతో టూ వీలర్స్ కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ కల్పిస్తోంది శ్రీమ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.
ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుశ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ప్రథమ శ్రేణి నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు మా రిటైల్ సైల్స్ విస్తరించాలని భావించాం. అందరికీ తేలిగ్గా ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందుబాటులోకి తెచ్చే విషయమై మేం ఫోకస్ చేశాం. అందుకోసం శ్రీమ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. మా కస్టమర్ల ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆకాంక్షలు వాస్తవ రూపం దాల్చేందుకు గల ఆర్థిక అవరోధాలను బ్రేక్ చేయడమే మా లక్ష్యం. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం దిశగా శరవేగంగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది’ అని పేర్కొన్నారు.
కస్టమర్లు తమకు సమీపంలోని ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పొందొచ్చు. ఓలా యాప్ డౌన్ లోడ్ చేసుకుని డిటైల్డ్ ఫైనాన్సింగ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం 850+కి పైగా ఎక్స్పీరియన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఓలా ఎలక్ట్రిక్.. వచ్చే నెలాఖరు నాటికి 1000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్.. ఎస్1 ప్రో, ఎస్1, ఎస్1 ఎయిర్ స్కూటర్లు విక్రయిస్తున్నది. గత తొమ్మిది నెలలుగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్లో మొదటి స్థానంలో నిలిచింది.