Ola Electric | ఓలా ఎలక్ట్రిక్.. స్కూటర్ల విక్రయాల్లోనూ రికార్డులు నెలకొల్పింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.1,100 కోట్ల విలువైన స్కూటర్లు అమ్ముడయ్యాయని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. భారీగా ఆర్డర్లు పోటెత్తుతుండటంతో గురువారం అర్ధరాత్రి విక్రయాల ప్రక్రియ నిలిపేశామని, నవంబర్ ఒకటో తేదీన సేల్స్ పునఃప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
బుధవారం ఉదయం ఆన్లైన్లో మొదలైన ఓలా స్కూటర్ల విక్రయాల్లో.. తొలి 24 గంటల్లో సెకన్కు నాలుగు స్కూటర్లు అమ్ముడయ్యాయి. తొలి రోజు రూ.600 కోట్ల విలువ గల స్కూటర్లు సేల్ అయ్యాయి. రెండో రోజు విక్రయాలు రూ.1100 కోట్లకు చేరాయి. ఆటోమొబైల్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఈ-కామర్స్ బిజినెస్లో ఈ స్థాయిలో స్పందన రావడం గమనార్హం.
గత నెల 15న ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో మోడల్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు జూలైలో రూ.499 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకునేందుకు ఆప్షన్ కల్పించింది. కేవలం 24 గంటల్లోనే లక్షకు పైగా స్కూటర్లు బుక్ అయ్యాయి.
ఓలా యాప్ ద్వారా ఈ నెల 15 నుంచి రూ.20 వేలు చెల్లించి, కొనుగోలు చేయొచ్చు. మిగతా మొత్తం స్కూటర్ డెలివరీ టైంలో చెల్లిస్తే చాలు. ఇప్పుడు డబ్బు చెల్లించిన కస్టమర్లకు స్కూటర్ డెలివరీ టైం వచ్చే మూడు రోజుల్లో ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించనున్నది.