ఇన్ఫోటెయిన్మెంట్ సర్వీస్ అయిన ‘ఓలా ప్లే’ను త్వరలోనే రద్దు చేయనున్నట్టు ఓలా కంపెనీ ప్రకటించింది. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ సర్వీస్ని భారతదేశంలో నిలిపివేస్తున్నట్టు ఓలా తెలిపింది. ప్రయాణికులకు తమ క్యాబ్ రైడ్ని ఎంజాయ్ చేయడం కోసం 2016 నవంబర్లో ఓలా ఈ సర్వీస్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో సెడాన్ కార్లలో ట్యాబ్లెట్స్ని ఏర్పాటు చేసింది. ప్రయాణికులు క్లౌడ్ టెక్నాలజీ సాయంతో పాటలు వినడంతో పాటు వీడియోలు, టీవీ షోలు చూసేందుకు ఈ ఎన్ఫోటెయిన్మెంట్ సర్వీస్ని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు ఓలా ప్లే ద్వారా ప్రయాణికులు క్యాబ్ని ట్రాక్ కూడా చేయొచ్చు.
ఈ ఏడాది జూన్ నెలలో ‘ఓలా డాష్’ సర్వీస్ని ఓలా కంపెనీ నిలిపి వేసింది. దీనికే ‘ఓలా కార్స్’ అనే పేరుంది. ఎలక్ట్రానిక్ వాహానాల తయారీ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓలా సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో పేరుతో రెండు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.