న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమైన ముడి చమురు ధర సోమవారం భారీగా దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల లోపునకు పడిపోయింది. చైనాలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, లాక్డౌన్ల విధింపుతో చమురుకు డిమాండ్ తగ్గుతుందన్న అంచనాలు మార్కెట్లో ఏర్పడ్డాయని కమోడిటీ విశ్లేషకులు తెలిపారు. దీంతో క్రూడ్ ధర ఒక్కసారిగా 6 శాతం పతనమయ్యింది. కడపటి సమాచారం అందేసరికి బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 6.33 డాలర్ల తగ్గుదలతో 99.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
ఇదేబాటలో బంగారం
క్రూడ్ బాటలోనే బంగారం సైతం పయనించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర హఠాత్తుగా 40 డాలర్లు పడిపోయి 1,900 డాలర్ల దిగువకు తగ్గింది. కడపటి సమాచారం అందేటప్పటికి ఇది 1,895 డాలర్ల వద్ద కదులుతున్నది. సోమవారం రాత్రి ప్రపంచ మార్కెట్ను అనుసరిస్తూ భారత్లోని మల్టీకమోడిటీ ఎక్సేంజ్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 840క్షీణించి, 51,420 వద్దకు పడిపోయింది.