E20 Fuel | E20 పెట్రోల్పై వాడకం వల్ల వాహనాల ఇంజిన్ భద్రతతో పాటు మైలేజ్ తగ్గుతుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం (E20) ఫ్యూయల్పై వస్తున్న వార్తలపై పెట్రోలియం మంత్రిత్వశాఖ స్పందించింది. ఈ20 మైలేజ్ భారీగా తగ్గుతుందన్న వాదనల్లో నిజం లేదని.. ఈ20తో స్వల్పంగా మైలేజ్పై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. E10 కోసం రూపొందించిన వాహనాల్లో వాడితే ఒకటి నుంచి రెండుశాతం వరకు మాత్రమే మైలేజ్లో తేడాలు ఉండవచ్చని.. ఇతర వాహనాల్లో ఇది మూడు నుంచి ఆరుశాతం వరకు ఉండవచ్చని స్పష్టం చేసింది. అయితే, 2009 నుంచి పలు వాహనాల తయారీ కంపెనీలు E20 అనుకూల వాహనాలను తయారు చేస్తుండడంతో మైలేజ్ ప్రభావం గణనీయంగా ఉండదని క్లారిటీ ఇచ్చింది.
డ్రైవింగ్ అలవాట్లు, వాహనాల సేఫ్టీ, టైర్ల ప్రెజర్, అలైన్మెంట్, ఏసీ వాడకం తదితర అంశాలు మైలేజ్పై ప్రభావం చూపుతాయని తెలిపింది. E20లో 80శాతం పెట్రోల్, 20శాతం ఇథనాల్ ఉంటుందని.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు E20 ప్రభుత్వ జాతీయ కార్యక్రమని తెలిపింది. తప్పుడు సమాచారం ఇస్తూ వాహనాల బీమా విషయంలో భయాందోళన వ్యాప్తి చేస్తున్నారని.. ఈ పథకాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే, ఈ20 వాడకం వల్ల కలిగే నష్టాలను బీమా కంపెనీలు భరించవని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ20 ఇంధనం వాడకం వాహనాల బీమా చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. మైలేజ్ తీవ్రంగా తగ్గుతుందన్న వాదనల్లోనూ నిజం లేదని పేర్కొంది. నీతి ఆయోగ్ ప్రకారం.. చెరకు ఆధారిత ఇథనాల్ 65శాతం, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ 50శాతం ఉద్గారాలను తగ్గిస్తుంది. గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్లో ఇథనాల్ను మిక్స్ చేసి పెట్రోల్ని విక్రయించడం వల్ల రూ.1.44లక్షల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశాయి.
245లక్షల టన్నుల ముడి చమురును భర్తీ చేశాయని.. 736లక్షల టన్నుల CO2 (కార్బన్-డై-ఆక్సైడ్) ఉద్గారాలను తగ్గించాయి. ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం. ఈ సంవత్సరం 20 శాతం మిశ్రమంతో రైతులకు రూ.40వేలకోట్లు చెల్లించనున్నట్లు భావిస్తున్నారు. రూ.43వేలకోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని భావిస్తున్నారు. అయితే, ఇథనాల్ కలిపిన పెట్రోలియం ధర తక్కువగా ఉండాలని పలువురు వాదిస్తున్నారు. దీనికి మంత్రిత్వశాఖ స్పందిస్తూ 2020-21లో నీతి ఆయోగ్ నివేదిక తయారైన సమయంలో ఇథనాల్ చౌకగా ఉండేదని.. ఇప్పుడు దాని ధర పెట్రోల్ కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. జీఎస్టీతో సహా లీటర్కు రూ.71కిపైగానే ఉందని పేర్కొంది. ఈ20 కోసం ట్యూనింగ్, విడిభాగాలను మార్చాల్సిన అవసరం ఉందని వాహనదారులు భావిస్తే.. అథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.