ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయికి పెరిగిన తర్వాత లాభాల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.1 శాతం మేర నష్టపోయి 18,497 పాయింట్ల వద్ద ముగిసింది. అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ 0.35 శాతం మేర రేట్లను పెంచినా, మార్కెట్కు మాత్రం నష్టాలు తప్పలేదు. ఇదేతరహాలో మరికొద్దిరోజులు సైతం కరెక్టివ్ కన్సాలిడేషన్ జరుగుతుందని అధికశాతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 10 రోజుల మూవింగ్ ఏవరేజ్ను కోల్పోయినందున సూచీపై ఒత్తిడి ఉంటుందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా చెప్పారు. ఈ వారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం, వెల్లడించే భవిష్యత్తు అంచనాలు మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేస్తాయని మరో విశ్లేషకుడు తెలిపారు.
కీలకస్థాయి 18,600
ఈ వారం నిఫ్టీ తక్షణమే 18,600 పాయింట్ల స్థాయిని అధిగమించకపోతే కరెక్షన్ కొనసాగుతుందని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు. కీలకమైన 18,600పైకి చేరలేకపోతే 18,365 వద్ద కీలక మద్దతు ఉన్నదన్నారు. 18,600 స్థాయిని దాటితే 18,887 స్థాయికి పెరిగే ఛాన్స్ ఉందన్నారు. నిఫ్టీ 18,500 దిగువన కొనసాగితే 18,250 పాయింట్ల వరకూ తగ్గవచ్చని రాజేష్ పాల్వియా పేర్కొన్నారు.