IT Returns Must | ఒక ఆర్థిక సంవత్సరంలో మీ టీడీఎస్ లేదా టీసీఎస్ చార్జీలు రూ.25 వేలు దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే మీ ఆదాయం తక్కువగా ఉన్నా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనని ఐటీ నిపుణులు అంటున్నారు. వృద్ధులకు మాత్రం రూ.50 వేలు, అంత కంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ చార్జీలు దాటితే వారు కూడా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిందే. ఇక ఏదేనీ బ్యాంకులోని పొదుపు (సేవింగ్స్) ఖాతాలో రూ.50 లక్షలు, అంత కంటే ఎక్కువగా డిపాజిట్ చేసినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.
2019 ఆర్థిక చట్టంలోని 139 సెక్షన్లోని ఏడవ నిబంధన ప్రకారం ఒక్కోసారి ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. ఇక కరంట్ ఖాతాలో రూ. కోటి, అంత కంటే ఎక్కువ జమ చేసినా, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసినా, ఏడాదిలో విద్యుత్ చార్జీల బిల్లు రూ. లక్ష దాటినా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిందే.
ఆదాయం పన్ను చట్టంలో 12ఏబీ అనే కొత్త నిబంధనను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆమోదించింది. దీని ప్రకారం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి అని సీబీడీటీ స్పష్టం చేసింది.