న్యూఢిల్లీ, నవంబర్ 16: ద్రవ్య విధాన చర్యలు, సరఫరా సజావుగా జరగడానికి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించినప్పటికీ, ధరల ముప్పు ఇంకా తొలగిపోలేదని రిజర్వ్బ్యాంక్ బులెటిన్ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం నవంబర్ బులెటిన్లో వివరిస్తూ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత త్రైమాసికంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలు కన్పిస్తున్నాయని, ఉత్పాదక రంగం నీరసించిందని, సర్వీసుల రంగం కొవిడ్ తదుపరి విస్తరణ మరింత కొనసాగే అవకాశాలు తక్కువని ఆర్బీఐ బృందం అభిప్రాయపడింది. కఠిన ద్రవ్య పరిస్థితులతో గ్లోబల్ ఎకానమీకి గణనీయమైన రిస్క్ ఏర్పడుతున్నదని హెచ్చరించింది.
ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరం లో సగటున 6.7%, ఈ ఏడాది జూలై-ఆగస్టుల్లో 7.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 5 శాతం, 4.9 శాతానికి దిగిరావడం కాస్త ఊరటనిచ్చే అంశమని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. 2022-23లో వరుసగా ఏడు నెలలపాటు దడపుట్టించిన ద్రవ్యోల్బణం 2022 నవంబర్లో ఆర్బీఐ నిర్దేశితస్థాయి 6 శాతం దిగువకు తొలిసారిగా తగ్గిందని, అటుతర్వాత మళ్లీ పెరుగుతూ వచ్చిందని వివరించింది. ఇటీవల తిరిగి నెమ్మదించినట్టు కన్పిస్తున్నా, ధరల ముప్పు నుంచి ‘మనం ఇంకా బయటపడలేదు. చాలా మైళ్ళ దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని ఆర్బీఐ బృందం వ్యాఖ్యానించింది.
పండుగ సీజన్ డిమాండ్ ఫలితంగా ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీడీపీ క్యూ2కంటే పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు బులెటిన్ తెలిపింది. మౌలిక రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు, ప్రైవేటు రంగ మూలధన పెట్టుబడులు పెరగడం, ఆటోమేషన్, డిజిటలైజేషన్ తదితరాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తున్నాయన్నది. కొవిడ్ ముందస్తు స్థాయికి జీడీపీ చేరుతుందని, మార్కెట్ ఎక్సేంజ్ రేట్ల ప్రకారం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తున్నదని తెలిపింది. కనిష్ఠ కరెన్సీ ఒడిదుడుకులు, ఆరోగ్యకరస్థాయిలో విదేశీ మారకపు నిల్వలు, విదేశీ మూలధన పెట్టుబడుల కారణంగా కరెంటు ఖాతా లోటు అదుపు తదితర అంశాలు భారత్కు కలిసివస్తున్నాయని వివరించింది.