న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సిమెంట్ దిగ్గజాలు ఏసీసీ, అంబూజా సిమెంట్స్లో పబ్లిక్ షేర్హోల్డర్ల నుంచి 26 శాతం కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ జారీచేసిన రూ. 31,000 కోట్ల ఓపెన్ ఆఫర్కు స్పందన కరువయ్యింది. ఈ షేర్లకు అదానీ ఆఫర్ చేస్తున్న ధరకంటే మార్కెట్లో ఇవి అధికంగా ట్రేడ్ అవుతున్నందున, ఓపెన్ ఆఫర్కు బిడ్ చేసేందుకు పబ్లిక్ ఇన్వెస్టర్లు మొగ్గు చూపలేదు. ఆఫర్కు ముగింపు రోజైన శుక్రవారం నాటికి 40.51 లక్షల షేర్లు టెండర్ అయ్యాయని ఏసీసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. 4.89 కోట్ల ఏసీసీ షేర్ల కొనుగోలుకు ఆదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ జారీచేయగా అందులో కేవలం 8.28 శాతం షేర్లు మాత్రమే టెండర్ అయ్యాయి.
అలాగే 51.63 కోట్ల అంబూజా సిమెంట్స్ షేర్లకు ఆఫర్ ప్రకటించగా, 6.97 లక్షల షేర్లు (1.35 శాతం) మాత్రమే టెండర్ అయ్యాయి. ఏసీసీ షేర్హోల్డర్లకు షేరుకు రూ. 2,300 చొప్పున, అంబూజా సిమెంట్స్కు రూ.385 ధరతోనూ కొనుగోలు చేసేందుకు ఆగస్టు 26న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ జారీచేసింది. శుక్రవారం స్టాక్ ఎక్సేంజీల్లో ఏసీసీ రూ.2,505 గరిష్టస్థాయిని, అంబూజా సిమెంట్స్ రూ.485 గరిష్టస్థాయిని తాకాయి. వాటికి అదానీ ఆఫర్ చేసిన ధరకంటే ఇవి 8-20 శాతం అధికం. అంతర్జాతీయ కంపెనీ హోల్సిమ్ నుంచి ఏసీసీ, అంబూజా సిమెంట్స్లో 63 శాతం యాజమాన్య వాటాను అదానీ గ్రూప్ టేకోవర్ చేసింది.
ఈ లావాదేవీ విలువ 10.5 బిలియన్ డాలర్లు (రూ.83,920 కోట్లు). సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఈ కంపెనీల్లో 26 శాతం వాటా కోసం హోల్సిమ్కు చెల్లించిన ధర ప్రకారమే పబ్లిక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ జారీచేయాల్సి ఉంటుంది. ఏసీసీ, అంబూజాలకు 7 కోట్ల టన్నుల సిమెంట్ ఉత్పాదక సామర్థ్యం ఉంది. దేశవ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ యూనిట్లు, 80 రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు ఉన్నాయి.
ఈక్విటీ షేర్లలోకి వారెంట్లను మార్చడానికి ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్కు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ నుంచి ఎటువంటి అనుమతి అక్కర్లేదని అదానీ గ్రూప్ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్) తెలియజేసింది. ఈ మేరకు వీసీపీఎల్ నుంచి ఓ లేఖ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్కు వచ్చినట్టు ఎన్డీటీవీ స్టాక్ మార్కెట్లకు వెల్లడించింది. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను అదానీ దక్కించుకోవాలని చూస్తున్నది తెలిసిందే.